ఏపీ విషయాలు తెలంగాణ మంత్రులకు అవసరమా? : సజ్జల

రాష్ట్రాన్ని విడదీయడం తప్పు అని చంద్రబాబుకు, కాంగ్రెస్ కు అప్పుడే చెప్పాం

అమరావతి: ఏపీపైనా, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైనా తెలంగాణ మంత్రులు విమర్శలు చేయడం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎలాంటి గొడవలు లేకుండా, భేషజాలకు పోకుండా ఏపీతో ఉన్న అన్ని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారని… ఆయన చెప్పిన మాటలను ఆ రాష్ట్ర మంత్రులు వినలేదేమో అని ఎద్దేవా చేశారు.

అయినా ఏపీ విషయాలు తెలంగాణ మంత్రులకు అవసరమా? అని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి బిచ్చమెత్తుకుంటారని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం హైదరాబాదులోనే కేంద్రీకృతం కావడం వల్ల అందులో వాటా ఇవ్వాలని రాష్ట్ర విభజన సమయంలో అడిగామని సజ్జల తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీయడం తప్పు అని చంద్రబాబుకు, కాంగ్రెస్ కు అప్పుడే చెప్పామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం దిగిపోతూ విద్యుత్ రంగంపై ఎంత భారం మోపిందో అందరికీ తెలుసని చెప్పారు. 2014లో డిస్కంల అప్పులు రూ. 33,580గా ఉండగా… టీడీపీ దిగిపోయే సమయానికి అవి రూ. 70,254కి చేరాయని విమర్శించారు. డిస్కంలను అప్పుల్లో ముంచెత్తిన వారు తమను ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/