పవన్‌ కళ్యాణ్‌పై సజ్జల ఫైర్‌

పవన్ కళ్యాణ్ ఫై వైసీపీ నేతల దాడి ఆగడం లేదు. సినిమా ఫంక్షన్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై , వైసీపీ నేతల ఫై పవన్ చేసిన కామెంట్స్ కు వైసీపీ నేతలు సైతం అదే రేంజ్ లో ఎదురుదాడి చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు వరుసగా మాటల యుద్ధం చేస్తున్నారు.

తాజాగా పవన్‌ కళ్యాణ్‌పై సజ్జల ఫైర్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఒళ్లంతా బురద చల్లుకుని మాట్లాడుతున్నారని… తమ పాలిట గుదిబండ అయ్యారని ఇండస్ట్రీలో అందరూ పవన్ గురించి అనుకుంటున్నారని సజ్జల అన్నారు. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థలో ప్రభుత్వానిది సహకార పాత్రేనని… ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను సినీ ప్రముఖులంతా ఆహ్వానిస్తున్నారన్నారు. టిక్కెట్ల రాబడితో ప్రభుత్వం లోన్లు తీసుకుంటారనడం అసంబద్దమైందని… ఆన్ లైన్ టికెట్ వ్యవహారంలో ప్రభుత్వం ముందుకే వెళ్తుందని స్పష్టం చేశారు.

మరోపక్క పవన్ కళ్యాణ్ ఫై వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. టీడీపీతో పవన్‌ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. సినిమా టికెట్ల అంశాన్ని అడ్డుపెట్టుకొని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన మాటలు, చేష్టలు, ఆయన అపరిపక్వ, అపసవ్య ఆలోచనా విధానానికి, అవగాహనాలేమికి అద్దం పడుతున్నాయన్నారు.