రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..సఫ్రాన్ ఏరో ఇంజిన్ రిపేర్ యూనిట్
150 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్న ఫ్రాన్స్ కంపెనీ
హైదరాబాద్ : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏరో ఇంజిన్ రిపేర్ సంస్థ సఫ్రాన్ తెలంగాణలోకి అడుగుపెట్టబోతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఆ సంస్థ విమానాల మెయింటెనెన్స్ అండ్ రిపేర్ (ఎంఆర్ఓ) యూనిట్ను నెలకొల్పనుంది. హైదరాబాద్లో నెలకొల్పనున్న ఎంఆర్ఓ యూనిట్ ఆ సంస్థ అన్ని యూనిట్లలోకి అతి పెద్దదిగా నిలవనుంది. హైదరాబాద్ యూనిట్ కోసం ఆ కంపెనీ తొలి విడతగా 150 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది.
హైదరాబాద్లో ఎంఆర్ఓ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సఫ్రాన్కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఏరో ఇంజిన్ రిపేర్ రంగంలో భారత్లో ఇప్పటిదాకా ఏ విదేశీ కంపెనీ తన యూనిట్ను ఏర్పాటు చేయలేదన్న కేటీఆర్…హైదరాబాద్లో సఫ్రాన్ ఏర్పాటు చేయనున్న యూనిట్ భారత్లో తొలి విదేశీ కంపెనీ యూనిట్గా రికార్డులకు ఎక్కనుందని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 800 నుంచి 1,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ యూనిట్ ద్వారా ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్కు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/