నారాయణఖేడ్ ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి సబితా ఆగ్రహం

నారాయణఖేడ్ లోని కస్తుర్భా బాలికల వసతి గృహంలో పురుగుల టిఫిన్ తినడంతో దాదాపు 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. టిఫిన్ తిన్న వారు వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో వారిని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన పట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్ట్ సీరియస్ అయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు చికిత్స పొందుతున్న నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారికి కి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. విద్యార్థులందరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేంతవరకు ఏరియా ఆసుపత్రిలోనే ఉండి పర్యవేక్షించాలని జిల్లా వైద్యశాఖ అధికారిని ఆదేశించారు. అయితే వాళ్ళు ఏం తిన్నారు, వాళ్లు తిన్న ఫుడ్ పాయిజన్ అయిందా? లేక వాటర్ పొల్యూట్ అయిందా అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

కాగా గత కొద్దీ నెలలుగా తెలంగాణ లో వరుసగా ప్రభుత్వ హాస్టల్ లలో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు విద్యార్థులను , వారి తల్లిదండ్రులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు.. ఆహారం తినాలంటే భయపడుతున్నారు. నీళ్లు తాగాలంటే టెన్షన్ పడుతున్నారు. ఏ క్షణం అనారోగ్యానికి గురవుతారో అని ఆందోళనపడుతున్నారు. ఎప్పుడు ఎవరు సడెన్‌గా పడిపోతారో వాళ్లకే తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు ఆశ్రమాలలో , కాలేజీ హాస్టల్ లలో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు హాస్పటల్ పాలయ్యారు.