ఉక్రెయిన్​లోని అతిపెద్ద న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​పై రష్యా దాడి

అది పేలితే పెను ప్ర‌మాదం..ఉక్రెయిన్‌కు ప‌లు దేశాల అధ్య‌క్షుల ఫోన్

న్యూఢిల్లీ : ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుని ర‌ష్యా క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఐరోపాలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ జపోరిజ్జియా కేంద్రంపై దాడులు జ‌రుపుతోంది. ఎనర్హోదర్ నగరంలో ఈ కేంద్రం ఉంటుంది. ర‌ష్యా దాడుల‌తో ఆ అణువిద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయి. దానిపై దాడులు కొన‌సాగితే పెను విధ్వంసం తప్పదని నిఫుణులు హెచ్చ‌రిస్తున్నారు. ర‌ష్యా దాడి చేసిన ప్రాంతంలోని రియాక్టర్ ప్రస్తుతం వినియోగంలో లేకపోయిన‌ప్ప‌టికీ అందులో అణు ఇంధనం ఉందని అన్నారు. ఒక‌వేళ జపోరిజ్జియా అణు కేంద్రం పేలిపోతే జరిగే నష్టం చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం పేలుడు కంటే 10 రెట్లు ఎక్కువగా న‌ష్టం ఉంటుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా కూడా దీనిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ర‌ష్యా త‌మ అణు విద్యుత్తు కేంద్రంపై దాడికి పాల్ప‌డిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కార్యాలయం ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఉక్రెయిన్కు దాదాపు 25 శాతం విద్యుత్తు ఈ అణు విద్యుత్తు కేంద్రం ద్వారానే అందుతోంది. అణు విద్యుత్తు కేంద్రంలో ఇప్ప‌టికే రేడియేషన్ స్థాయి పెరిగింద‌ని అక్క‌డి అధికారులు అంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌క‌యితే అణు విద్యుత్తు కేంద్రంలో మంటలు ప్లాంట్లోని కీలక పరికరాలపై ప్రభావం చూపలేదని అంతర్జాతీయ అణు శక్తి కేంద్రం చెప్పింది. ఉక్రెయిన్ అధికారుల‌తో అంతర్జాతీయ అణు శక్తి కేంద్రం డైరెక్టర్ జనరల్ రఫీల్ మారియానో ఫోనులో మాట్లాడారు. ఈ దాడి ప‌ట్ల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/