యద్ధంలో 500 మంది సైనికులను కోల్పోయాం : రష్యా ప్రకటన

ఉక్రెయిన్‌లో కీలక ఓడరేవును సొంతం చేసుకున్న రష్యా

హైదరాబాద్: ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో తమవైపు జరిగిన నష్టాన్ని రష్యా తొలిసారి ప్రకటించింది. ఈ యుద్ధంలో 500 మంది తమ సైనికులు చనిపోయినట్టు ప్రకటించింది. అలాగే, మరో 1600 మంది గాయపడినట్టు పేర్కొంది. నిజానికి తాము 6 వేల మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ప్రకటించింది. దీనిని ఖండిస్తూ రష్యా ఈ ప్రకటన చేసింది.

మరోవైపు, ఉక్రెయిన్‌లోని కీలకమైన ఖేర్సన్ ఓడరేవును పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నట్టు రష్యా ప్రకటించింది. ఈ ఓడరేవును సొంతం చేసుకుని తీరంతో దేశానికి సంబంధాలు తెగిపోయేలా చేసేందుకు వారం రోజులుగా చేస్తున్న రష్యా ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. అంతేకాదు, ఓడరేవు పాలనా యంత్రాంగాన్ని కూడా రష్యా అదుపులోకి తీసుకున్నట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

మరియుపొల్, ఖర్కివ్ నగరాలను కూడా రష్యా దిగ్బంధించింది. ఈ నగరంలోకి చొచ్చుకుపోయేందుకు రష్యన్ దళాలు మరింతగా ప్రయత్నిస్తున్నాయి. రాకెట్లు, క్షిపణుల దాడులను ముమ్మరం చేశాయి. మరోవైపు, ఉక్రెయిన్‌లోని చెర్నిహైవ్‌లోని ఆసుపత్రిపై రెండు క్రూయిజ్ క్షిపణులు దాడిచేశాయి. ఇక్కడ జరిగిన ప్రాణ, ఆస్తినష్టం గురించి తెలియాల్సి ఉంది. కీవ్, ఖర్కివ్‌లపైనా దాడులు జరుగుతున్నాయి.మరియుపొల్ పాఠశాల సమీపంలో ఫుట్‌బాల్ ఆడుతున్న వారిపైనా రష్యన్ బలగాలు బాంబులు కురిపించాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/