స్వీడన్, ఫిన్లాండ్ లకు వార్నింగ్ ఇచ్చిన రష్యా

తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక

హైదరాబాద్ : ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా.. తాజాగా స్వీడన్, ఫిన్లాండ్ దేశాలకు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) కూటమిలో చేరితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఉక్రెయిన్ ఎదుర్కొన్న పరిణామాలను మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ హెచ్చరించారు. ఉక్రెయిన్ పై దాడికి దిగాలని పుతిన్ ఆదేశించిన తర్వాత పెస్కోవ్ నుంచి ఈ హెచ్చరిక జారీ అయింది.

మరోవైపు రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్ కథనం ప్రకారం, ఉక్రెయిన్ తో చర్చల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక బృందాన్ని కీవ్ కు పంపుతున్నట్టు సమాచారం. ఈ బృందంలో రక్షణశాఖ, విదేశాంగశాఖ, పాలనాశాఖలకు చెందిన అధికారులు ఉంటారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ, ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలను వదిలేస్తే ఆ దేశంతో చర్చలు జరుపుతామని అన్నారు. దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్చలకు తాము సిద్ధమని చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/