పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్ రావు హస్తం ఉంది – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

TSPSC పేపర్ లీకేజ్ ఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే దేశ వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ , సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఈడీ విచారణ ఎదురుకుంటుండగా..ఇప్పుడు పేపర్ లీకేజ్ ఘటన ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేస్తుంది. ప్రతి పక్షపార్టీలు , విద్యార్థి సంఘాలు ఆందోళల బాట పట్టాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టీఎస్ పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ జరిగిందంటూ ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్ రావు హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన వ్యక్తులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చెందిన కాన్ఫిడెన్సియల్ సెక్షన్ లో ఉన్నారని… వీరు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లను కవితకు అందజేశారని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని… సరైన సమయంలో వాటిని హైకోర్టుకు కానీ, సీబీఐకి కానీ అప్పగిస్తానని తెలిపారు.

TSPSC ఛైర్మన్ బి. జనార్ధన్ రెడ్డి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన సిట్ పై తనకు నమ్మకం లేదని ఈ అంశంలో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని… తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి ఆర్టికల్ 317 కింద టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని డిస్మిస్ చేయాలని కోరారు. ప్రస్తుతం ప్రవీణ్ చేసిన ఆరోపణలు మరింత హాట్ టాపిక్ గా మారాయి.