జలవివాదాన్ని పరిష్కరించవలసిన బాధ్యత కేంద్రానిదే

గ‌తంలో ప్రాజెక్టు వ‌ద్ద‌ పోలీసులు కొట్టుకున్నారు..రోజా

తిరుమల : వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాగే, తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదంపై స్పందించారు. ఏపీలో టీడీపీ హ‌యాంలో రైతులను దగా చేశార‌ని ఆరోపించారు. రైతుల కోసం ఏపీ సీఎం జగన్ భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశార‌ని చెప్పిన ఆమె, వివిధ పథకాల ద్వారా 83 వేల కోట్ల రూపాయలను రైతులకు అందజేశార‌ని తెలిపారు.

జ‌గన్ రైత‌ల సంక్షేమం కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంటే చంద్రబాబు, లోకేశ్ మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని పరిష్కరించవలసిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. గ‌తంలో ప్రాజెక్టు వ‌ద్ద‌ పోలీసులు కొట్టుకున్న విషయాన్ని లోకేశ్ మర్చిపోయారా? అని ఆమె ప్ర‌శ్నించారు.

టీడీపీ కోవర్టుగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆమె ఆరోపించారు. అప్ప‌ట్లో కేసీఆర్‌కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశార‌ని ఈ విష‌యం రేవంత్‌కి గుర్తు లేదా? అని ఆమె నిల‌దీశారు. రాష్ట్ర విభ‌జన అనంత‌రం 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైద‌రాబాద్‌లో ఉండకుండా అక్క‌డి నుంచి పారిపోయి వచ్చింది చంద్ర‌బాబు కాదా? అని ఆమె ప్ర‌శ్నించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/