తండ్రి, కొడుకులు తట్ట, బుట్టా సద్దుకుని హైదరాబాదుకు పోండి – ఎమ్మెల్యే రోజా

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో ఓటర్లు బాబు కు భారీ షాక్ ఇచ్చారు. గతంలో జరిగిన పంచాయతీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాగైతే తెలుగుదేశం పార్టీ కి షాక్ ఇచ్చారో..ఈసారి కూడా అదే మాదిరిగా వైసీపీ కి జై కొట్టి..టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు. చంద్రబాబు కంచు కోటగా చెప్పుకునే కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేసింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో భాగంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో విజయం సాధించింది. దాంతో చైర్ పర్సన్ స్థానాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. అత్యధిక స్థానాల్లో గెలవడం తో విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ కుప్పంకోట బద్దలైందన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జయభేరి మోగించిందన్నారు. దీన్ని బట్టి రాష్ట్రంలోని ప్రజలతో పాటు ఎన్నో ఏళ్లుగా గెలిపిస్తున్న ఆయన సొంత నియోజవకర్గంలోని ప్రజలే బాబును నమ్మలేదని ఈ ఫలితాలతో అర్థమైందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా తనదైన స్టయిల్ లో కామెంట్స్ చేసింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో తండ్రి, కొడుకులు తట్ట, బుట్టా సద్దుకుని హైదరాబాదు పోవాలని చురకలు అంటించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా.. వార్ వన్ సైడే…ఏపీ ప్రజలు ఎప్పుడు.. జగన్ మోహన్ రెడ్డి వైపే ఉంటారని ఆమె పేర్కొన్నారు. నలబై ఏళ్ళు ఇండ్రస్టీ అయినా చంద్రబాబును కుప్పం ప్రజలు తరిమి కొట్టారని .. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును…హైదరాబాదు ఇంటికి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.