బ్యాడ్మింటన్ ఆడిన నగరి ఎమ్మెల్యే
నగరి ఎమ్మెల్యే , సినీ నటి రోజా మరోసారి వార్తల్లో నిలిచింది. భర్త సెల్వమణితో పోటాపోటీగా బ్యాడ్మింటన్ ఆడి తగ్గేదెలే అనిపించుకుంది. నవంబర్ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సంబరాల్లో భాగంగా సోమవారం బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. నగరి, పుత్తూరు మండలాలకు సంబంధించిన పోటీల్లో ఎమ్మెల్యే రోజా తన భర్త సెల్వమణి, సోదరుడు కుమారస్వామిరెడ్డితో బ్యాట్మింటన్ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతిభ ఉన్నా అవకాశం లేక అనేక మంది క్రీడాకారులు మరుగున పడుతున్నారని తెలిపారు. అందువల్లే మండల, నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
నగరి డిగ్రీ కళాశాల మైదానంలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘ డైరెక్టర్ చంద్రారెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణన్, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు బీఆర్వీ అయ్యప్పన్, నాయకులు దయానిధి, మురుగ, మునికృష్ణారెడ్డి, అయ్యప్ప, కన్నాయిరం తదితరులు పాల్గొన్నారు.