మంత్రి రోజాకు అన్నయ్య ముద్దు ..కామెంట్స్ పై స్పందించిన రోజా

కుటుంబ సభ్యుల బంధాల విలువ తెలిసిన వాళ్లు ఇలాంటి చీప్ కామెంట్లు చేయరని వ్యాఖ్య

minister-roja

అమరావతి : సోషల్ మీడియా వేదికగా తన గురించి నీచంగా కామెంట్లు చేస్తున్న వారిపై ఏపీ మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా మంత్రి అయిన తర్వాత ఆమె సోదరుడు ఆమెను ముద్దు పెట్టుకున్నారు. దీనిపై పలువురు నెటిజెన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ… తనను, తన కుటుంబ సభ్యులను విమర్శించడానికి టీడీపీ వాళ్లకు ఇప్పుడు జనసేన వాళ్లు కూడా తోడయ్యారని మండిపడ్డారు. బలమైన నాయకులను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను మినిస్టర్ అయిన తర్వాత తన అన్న తనకు ముద్దు పెడితే కూడా పెడార్థాలు తీస్తున్నారని రోజా మండిపడ్డారు. తనకు అమ్మనాన్నలు లేరని… ఇద్దరు అన్నయ్యలే తనను పెంచారని చెప్పారు. స్కూలుకు వెళ్లినప్పుడు, కాలేజీకి వెళ్లినప్పుడు, షూటింగుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా 24 గంటలూ వాళ్ల జీవితం కాదని, తన కోసం పని చేస్తున్నారని చెప్పారు. అలాంటి అన్నయ్య గురించి కూడా వీళ్లు ట్రోల్ చేస్తున్నారని… వీళ్లు ఒక అమ్మకు, అబ్బకు పుట్టిన వాళ్లేనా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానుబంధాల విలువ తెలిసిన వారు ఇలాంటి చీప్ కామెంట్లు చేయరని అన్నారు.