రోహిత్ ఫిట్నెస్ పాస్
నేషనల్ క్రికెట్ అకాడమీలో డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ఫిట్నెస్ పరీక్ష
బెంగళూరు : టెస్టు జట్టును చేరుకోడానికి జరిపిన ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ శర్మ పాసయ్యాడు. శుక్రవారం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో రోహిత్కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారు.
అందులో రోహిత్ పాసయ్యాడు. ఇక జట్టును చేరుకోడానికి రోహిత్కు ఎలాంటి అడ్డంకులు లేవు. ఐపిఎల్ సందర్భంగా రోహిత్ శర్మ తుంటి ఎముక గాయానికి గురైన సంగతి తెలిసిందే.
రోహత్ ఫిట్నెస్తోపాటు బ్యాటింగ్ స్కిల్స్ను పరిశీలించినట్టు, అతడు పూర్తి ఫిట్నెస్ను సంతరించుకున్నాడని ద్రవిడ్ బిసిసిఐకి సమాచారమిచ్చాడు.
పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ అయిన రోహిత్ టీమిండియా ఆడనున్న టెస్టులలో పాల్గొననున్నాడు.
ఒకటి రెండు రోజులలో రోహిత్ దుబాయ్ నుంచి సిడ్నీ వెళ్లనున్నాడు. ఆస్ట్రేలియా చేరుకున్న తరువాత రోహిత్ 14 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. అందువల్ల రోహిత్ తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడు.
జనవరి 7నుంచి సిడ్నీలో, జనవరి 15నుంచి బ్రిస్బేన్లో జరిగే చివరి రెండు టెస్టులలో మాత్రమే పాల్గొనే అవకాశముంది. కాగా అడిలైడ్లో జరిగే తొలి టెస్టు అనంతరం కెప్టెన్ కోహ్లి పితృత్వ సెలవుపై స్వదేశానికి రానున్న సంగతి విదితమే.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/