ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుడు..17 మంది మృతి

మరో 50 మంది వరకు గాయాలపాలు

bomb-attack-in-afghanistan

కాబుల్‌: ఆఫ్ఘనిస్థాన్ మరోసారి నెత్తురోడింది. బమియాన్ నగరంలో జరిగిన రెండు శక్తిమంతమైన బాంబు పేలుళ్లలో 17 మంది వరకు మృతి చెందారు. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు. నగరంలోని రద్దీగా ఉండే వీధుల్లో రోడ్డు పక్కన ఉంచిన పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు పేల్చివేయడంతో ఈ ఘోరకలి జరిగిందని నగర పోలీస్ చీఫ్ జబర్దస్త్ సఫాయ్ వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్ లోని బమియాన్ నగరంలో ఎక్కువగా షియా హజారా వర్గం ప్రజలు నివసిస్తుంటారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు. ఆఫ్ఘనిస్థాన్ లో ప్రముఖ పర్యాటక స్థలంగా బమియాన్ పేరొందింది. అంతేకాదు, దేశంలోనే అత్యంత భద్రమైన చోటుగా భావించే బమియాన్ లో బాంబు పేలుళ్లు జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పేలుళ్లలో క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తాలిబన్‌ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/