నేడు కరీంనగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని కసరత్తులు చేస్తుంది. మొన్నటివరకు నేతల మధ్య విభేదాలు ఉండేవి కానీ..ఇప్పుడు అన్ని సెట్ అయ్యి అందరు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు. ఈ తరుణంలో మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 6న సాయంత్రం 4 గంటలకు వరంగల్‌లోని ఆర్ట్స్‌ కాలేజీలో జరిగే రైతు సంఘర్షణ సభకు ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజవ్వనున్నారు. మే 7న రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బోయిన్‌పల్లిలో పార్టీకి చెందిన పదిన్నర ఎకరాల్లో రాజీవ్‌ గాంధీ నాలెడ్జ్‌ సెంటర్‌ నిర్మాణానికి రాహుల్‌తో భూమి పూజ చేయించనున్నారు.

అలాగే అక్కడే తెలంగాణ అమర వీరులు, ఆత్మహత్య చేసుకున్న రైతులు, నిరుద్యోగుల కుటుంబాలతో రాహుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కాగా వరంగల్ సభ ను భారీ సక్సెస్ చేసేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సభ కు ఐదు లక్షల మందిని తీసుకరావాలని చూస్తున్నారు. దీనికి తగ్గట్లే జిల్లాలకు సంబదించిన ఇంచార్జ్ లను నియమించారు.

మరోపక్క రాహుల్ పర్యటన కంటే ముందు జిల్లాల పర్యటనకు రేవంత్ సిద్దమయ్యాడు. అందులో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి..కరీంనగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం, నాలుగు జిల్లాల డీసీసీ అధ్యక్షులు సమావేశంలో భేటీ కానున్నారు.