రూ. 25 కోట్లకు బీజేపీకి రేవంత్ అమ్ముడుపోయాడు – కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజార్టీ తో విజయ ఢంకా మోగించారు. ఈ విజయం పట్ల బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే..తెరాస మాత్రం షాక్ లో పడింది. ఇక ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడం అనేక అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.

ఇదిలా ఉంటె రూ. 25 కోట్లకు బీజేపీకి రేవంత్ అమ్ముడుపోయాడంటూ తెరాస నేత కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీచేయడం దేశంలో ఎక్కడా లేదని, కానీ హుజూరాబాద్‌లో జరిగిందని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు 62 వేలకుపైగా ఓట్లు పోలయ్యాయని, కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు.

ఈ ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా బరిలోకి దిగినప్పటికీ చివరికి బల్మూరి వెంకట్ ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా నిలిచిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల నుంచి ఆయనకు పూర్తిస్థాయి సహకారం లభించలేదన్నారు. ఆయన కోసం ప్రచారం చేసేందుకు ఒక్కరు కూడా రాలేదని, చివరికి రెండు పొట్టేళ్ల మధ్య నలిగిపోయిన లేగదూడ పరిస్థితి ఆయనకు ఎదురైందని కౌశిక్ అన్నారు.