తెలంగాణలో నక్సలైట్లు ఉంటే బాగుండేదని రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సమయంలో నక్సలైట్లు ఉంటే బాగుండేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నక్సలైట్ల భయంతోనైనా పాలకులు సమర్థంగా పాలన చేసేవారన్నారు.

ఆదివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్… రాష్ట్రంలో పోలీసు శాఖ రెండు వర్గాలుగా చీలిపోయిందని.. రాజకీయ నేతల ఫోన్లే కాదు డీజీపీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారని అన్నారు. డీజీపీ సామాజిక వర్గాన్ని అనుమానించి తక్కువ హోదాలో ఉన్న అధికారితో ఆయనపై నిఘా పెట్టారని ఆరోపించారు.

కేసీఆర్ బంధువును ఏపీ నుంచి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ ఇచ్చారని తెలిపారు. తెలంగాణకు కేసీఆర్‌ నిజాం ప్రభువు అయితే.. హరీశ్‌రావు ఖాసీం రజ్వీలా తయారయ్యాడని ఆరోపించారు. మేనరికపు సంబంధం ఇద్దామనుకుంటే పిల్లగాడు పరాయి పిల్లను చేసుకోవడంతో తల్లి మరో సంబంధం వెతికినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా హుజురాబాద్‌లో మరో అభ్యర్థిని వెతుక్కోవడం వల్ల ఆలస్యం అయిందని రేవంత్ తెలిపారు.