డ్రగ్స్ వ్యవహారంలో రాజకీయ దుమారం..స్పందించిన రేవంత్ రెడ్డి

కేటీఆర్ ను డ్రగ్స్ టెస్టుకు పంపగలరా అంటూ రేవంత్ సవాల్

హైదరాబాద్: రాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్‌ అండ్ మింక్ పబ్ లో పోలీసుల దాడుల వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ కేసులో తన సమీప బంధువు ఉన్నాడంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండడం పట్ల రేవంత్ రెడ్డి మండిపడ్డారు.తన బంధువర్గంలోని పిల్లలను ఏ ఆసుపత్రికైనా తీసుకువస్తానని, అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయిస్తానని అన్నారు. మరి, కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను కూడా డ్రగ్స్ టెస్టుకు పంపగలరా? అంటూ సవాల్ విసిరారు. పబ్ కేసులో తన వాళ్లు ఉంటే శిక్షించాలని, అంతేతప్ప చిన్నపిల్లలను అడ్డంపెట్టుకుని చిల్లర రాజకీయాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అంశంలో తాను నైతిక బాధ్యతతో వ్యవహరిస్తున్నానని, టీఆర్ఎస్ ప్రభుత్వమే తమకు కావలిసిన వాళ్లు ఉన్నారని అందరినీ వదిలేసిందని రేవంత్ ఆరోపించారు. అసలు, ఆ పబ్ 24 గంటలూ నడిచేందుకు అనుమతి ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. పబ్ లో దొరికిన 125 మందికి ఎందుకు టెస్టులు చేయలేదు? వారిని ఎందుకు వదిలేశారు? అని ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/