జహీరాబాద్ నిమ్జ్ భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్ పట్ల రేవంత్ ఫైర్

revanth reddy questions KTR over police lathi charge on farmers

జహీరాబాద్ నిమ్జ్ భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్ పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కేటీఆర్​.. దీన్ని అభివృద్ధి అంటారా? అరాచకం అంటారా..? అంటూ వరుస ప్రశ్నలు చిందించారు. కేటీఆర్ బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ పార్కును ప్రారంభించారు. అయితే జహీరాబాద్ లో నిమ్జ్ కోసం తమ భూములు తీసుకొని తగిన పరిహారం ఇవ్వలేదని అక్కడి రైతులు చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు.

ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పర్యటన ను అడ్డుకుంటారని నిమ్జ్ భూ నిర్వాసితులను పోలీసులు వారి గ్రామాల్లోకి వెళ్లి ముందస్తు అరెస్టులు చేశారు. కేటీఆర్ కార్యక్రమానికి వెళుతున్న కొందరిపై లాఠీఛార్జి చేశారు. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను ట్విట్టర్ లో షేర్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ‘బలవంతంగా భూమిని గుంజుకోవడం, బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం.. దీనిని అభివృద్ధి అంటారా? అరాచకం అంటారా?’ అని మంత్రి కేటీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. భూమిని త్యాగం చేసే రైతులకు లాఠీ దెబ్బలు.. లాభార్జనే ధ్యేయం అయిన వ్యాపారులకు రెడ్ కార్పెట్ పరుస్తారా? అని విమర్శించారు.

బలవంతంగా భూమిని గుంజుకోవడం…
బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం…

కేటీఆర్… దీనిని అభివృద్ధి అంటారా…?!అరాచకం అంటారా!?

భూమిని త్యాగం చేసే రైతుకు లాఠీదెబ్బలు… లాభార్జనే ధ్యేయమైన వ్యాపారులకు రెడ్ కార్పెట్లా…?! pic.twitter.com/hXShvRY3kI— Revanth Reddy (@revanth_anumula) June 23, 2022