హైదరాబాద్ లో మత కల్లోలాలు సృష్టించడానికి కేంద్ర మంత్రులు వస్తున్నారు – రేవంత్ రెడ్డి

ప్రశాంతమైన హైదరాబాద్ లో కుట్రలు, మత కల్లోలాలు సృష్టించడానికి కేంద్ర మంత్రులు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 న తెలంగాణ లో రాజకీయ పార్టీల మధ్య రచ్చ కొనసాగింది. అన్ని పార్టీలు ఎవరి దారిలో వారు వేడుకలను నిర్వహించాయి. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం జరపగా… టీఆర్ఎస్ సర్కార్ సమైక్యతా వజ్రోత్సవాలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ విలీన దినోత్సవం నిర్వహించింది. గాంధీభవన్ లో NSUI ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనము” పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేసారు.

మన దేశంతో పాటు తెలంగాణకు స్వాతంత్రం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కెసిఆర్ పెట్టిన కులాల కుంపటిని బిజెపి అందిపుచ్చుకుని మతాల మధ్య చిచ్చు పెడుతోంది అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్న రేవంత్ రెడ్డి, దేశాన్ని విభజించే పార్టీ బీజేపీ అంటూ ధ్వజమెత్తారు.

తెలంగాణ వేడుకల కోసం బీజేపీ వాడుకుంటున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆయన RSS ను నిషేధించారని తెలిపారు, స్వతంత్ర పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదన్నారు రేవంత్ రెడ్డి. చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని.. ఇతర పార్టీల అధ్యక్షులను దొంగిలించి చరిత్రలో స్థానం కల్పించుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు.ఇందుకు సెప్టెంబర్ 17ను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తో పాటు గుజరాత్ లోని జూనిఘాడ్ కూడా తర్వాతనే ఇండియన్ యూనియన్ లో విలీనం అయిందన్నారు. మరీ గుజరాత్ లో బిజేపీ వజ్రోత్సవాలు ఎందుకు నిర్వహించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెబుతున్న వాళ్ళు రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. గుజరాత్ నుంచి కొంతమంది దేశ దిమ్మరులు హైదరాబాద్ వచ్చారని పేర్కొన్న రేవంత్ రెడ్డి, మోడీ ఆదేశాలతో హైదరాబాద్ వచ్చారా? లేదా మీకు మీరే హైదరాబాద్ వచ్చారా? అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను టార్గెట్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.