రేపు జిల్లా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు

రాహుల్ ను ఈడీ విచారించడం పట్ల దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు , నిరసనలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునివ్వగా, ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించగా , అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులకు , కాంగ్రెస్ నేతలకు వాగ్వాదం , అరెస్ట్ లు వంటివి జరిగాయి. కాగా పోలీసుల లాఠీచార్జి లో పలువురు కాంగ్రెస్ నేతలు , కార్య కర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులపై దాడులను నిరసిస్తూ, రేపు (శుక్రవారం) జిల్లా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రాజ్ భవన్ ముట్టడిలో అరెస్ట్ అయినా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీలు రేణుకా చౌదరి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాకా మీడియాతో మాట్లాడారు. కేంద్రాన్ని సంతృప్తి పరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేయించిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రహస్య ఆదేశాలతోనే తమ శాంతియుత ర్యాలీని పోలీసులు భగ్నం చేశారని, తద్వారా నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేందుకు యత్నించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నాటి కాంగ్రెస్ సర్కారు ఇలాగే వ్యవహరించి ఉంటే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉండేవాళ్లు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ ఇద్దరిదీ ఒకే బాట అని విమర్శించారు.

నేడు కాంగ్రెస్ శ్రేణులపై దాడులను నిరసిస్తూ, రేపు (శుక్రవారం) జిల్లా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అటు, పోలీసుల లాఠీచార్జిలో గాయపడి ఆసుపత్రిపాలైన టీపీసీసీ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ చామలను రేవంత్ రెడ్డి పరామర్శించారు. కిరణ్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.