మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..తన పాదయాత్రలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నాల్గు రోజుల క్రితం రేవంత్ హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ములుగు నుండి మొదలైన ఈ యాత్ర శుక్రవారం నాటికీ ఐదో రోజుకు చేరింది. యాత్ర ప్రారంభించిన మొదటి రోజే కేసీఆర్ ఫై , కేసీఆర్ సర్కార్ ఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రగతి భవన్‌ను నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చేయాలి అంటూ ఆయన అనడం తో బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేసారు. అలాగే పలు నగరాల్లో రేవంత్ దిష్టి బొమ్మ దహనం చేసారు. ఈ వ్యాఖ్యలు ఇంకా మీడియా లో కొనసాగుతుండగానే..ఈరోజు మరో కీలక వ్యాఖ్యలు చేసారు.

ఐదో రోజు రేవంత్ రెడ్డి కొత్త లింగాల గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్‌లో గెలిచి పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఈ 12 మంది ఎమ్మెల్యేలను ప్రజా కోర్టులో ఉరి తీయాలంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ 12 మంది ఎమ్మెల్యేలను డిపాజిట్లు కూడా రాకుండా ఓడగొట్టాలని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లోనే కాదు.. జీవితంలోనే ఎమ్మెల్యే అనే పదానికి వాళ్లకు దూరం చేసి.. రాజకీయంగా బొంద పెట్టాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఫిరాయింపులను అడ్డుకున్నప్పుడే.. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతుకుతుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి సీఎం కేసీఆర్ అక్రమంగా సంపాధించిన వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారని ఆరోపించారు.