తుక్కుగూడలో అమిత్ షా ప్రసంగం ఫై రేవంత్ కామెంట్స్
ప్రజా సంగ్రామ యాత్ర ముంగిపు సందర్భాంగా శనివారం తుక్కుగూడలో బిజెపి పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని..కేసీఆర్ , కాంగ్రెస్ ల ఫై నిప్పులు చెరిగారు. కాగా అమిత్ షా ప్రసంగంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తుక్కుగూడలో అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసినట్లుగా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రజల తరఫున తాము అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమే చెప్పలేదన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై ఆర్భాటపు ప్రకటనలు మాత్రమే చేస్తున్నారని అన్నారు. అవినీతిపై ఆచరణ చర్యలు ఉండవని తేలిపోయిందన్నారు. ‘అంతేలే షా జీ… మీ చీకటి మిత్రుడిపై ఈగ వాలనివ్వరుగా!’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
తుక్కుగూడలో అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసి… అన్నట్టుగా ఉంది.
తెలంగాణ ప్రజల తరపున మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. కేసీఆర్ కుటుంబ అవినీతి పై ఆర్భాటపు ప్రకటనలే తప్ప ఆచరణతో కూడిన చర్యలు ఉండవని తేలిపోయింది.
అంతేలే షా జీ… మీ చీకటి మిత్రుడి పై ఈగవాలనివ్వరుగా!!— Revanth Reddy (@revanth_anumula) May 14, 2022
ఇక అమిత్ షా ఏమాట్లాడారో చూస్తే..బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్బంగా తుక్కుగూడలో నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ను గద్దె దించేందుకు తాను అవసరం లేదని, బండి సంజయ్ ఒక్కడు చాలని అన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని, ప్రజలందరి సంక్షేమం కోసం చేసిన యాత్ర అని అన్నారు. రాష్ట్రంలోని నిరంకుశపాలనను అంతమొందించడం కోసం జరిగిన యాత్ర అని స్పష్టం చేశారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, రాష్ట్రంపై అందరికీ సమానహక్కు ఉందని తెలిపారు.
తెలంగాణలో వారసత్వ రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయని అమిత్ షా ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలను సాధిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్…ఆ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే నీళ్లు, నిధులు, నియామకాల హామీలను నెరవేరుస్తామని ఆయన చెప్పారు. ఈ హామీని నిలబెట్టుకునే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని ఆయన చెప్పారు. హైదరాబాద్ విముక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే సాధ్యమైందని అమిత్ షా చెప్పారు. తెలంగాణను కేసీఆర్ మరో బెంగాల్ లా మారుస్తారని ఆయన విమర్శించారు.