అగ్నివీర్లకు శుభవార్త తెలిపిన హర్యానా ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను గ్యారంటీగా ఇస్తాం
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటన

హర్యానా : అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంటే.. మరోవైపు ఈ పథకాన్ని సమర్థించేవారూ గణనీయంగా పెరుగుతున్నారు. ఇప్పటికే చాలా మంది పారిశ్రామికవేత్తలు.. సుశిక్షుతులైన అగ్నివీర్లను నాలుగేళ్ల సర్వీసు అనంతరం తమ సంస్థల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇలా ప్రకటించిన వారిలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చీఫ్ ఆనంద్ మహీంద్రా, టాటా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా తదితరులు ఉన్నారు.

తాజాగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అగ్నివీర్లకు శుభవార్త చెప్పింది. రిటైర్ అయిన అగ్నివీర్లకు హర్యానా సర్కారు ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. అగ్నివీర్ గా సర్వీసు ముగించుకుని వచ్చే వారికి గ్రూపు సీ లేదా పోలీసు ఉద్యోగాలను గ్యారంటీగా ఇస్తామని పేర్కొన్నారు.

మరోవైపు అగ్నివీర్ల నియామకానికి ఎయిర్ ఫోర్స్ సైతం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలై, జులై 5న ముగుస్తుంది. ఆన్ లైన్ పరీక్షలు జులై 24 నుంచి మొదలవుతాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/