న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ సర్కార్ ఆంక్షలు..

Delhi government bans all mass gatherings for Christmas, New Year celebrations

ఓమిక్రాన్ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. హైకోర్టు ఉత్తర్వుల ఆదేశాలతోనే ఆంక్షలు విధించిన సర్కార్.. జనాలు ఎక్కువ ఉన్నచోట్ల థర్మల్ స్కానింగ్, మాస్క్ తప్పనిసరి చేసింది. ఈ రోజు నుంచి జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు తెలిపింది. పబ్లిక్ ఈవెంట్లలో భౌతిక దూరాన్ని తప్పని సరి చేసింది. ఓమిక్రాన్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సర్కార్ సూచిస్తోంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. మాస్కులు పెట్టుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చిరించింది. ఇప్పటికే మధ్య ప్రదేశ్, ఢిల్లీ, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఓడిశా, హర్యానా రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా వాటి జాబితాలో చేరింది.

గత నెలలో దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ వైరస్ ముప్పు ఇప్పుడు భారత్ ను గట్టిగా తాకుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువగానే కేసులు నమోదవుతుండటంతో కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. మొదట్లో ఒకటిరెండు కేసులు కనిపించినా చూస్తుండగానే రెండు వారాల్లోనే దాదాపు 400 కేసులకు పరిస్ధితి చేరిపోయింది. దీంతో పాటు ఓమిక్రాన్ వ్యాప్తి కూడా లక్షణాలు లేకుండానే సాగిపోతుండటంతో ఇప్పుడు దాని తీవ్రత గుర్తించడం కూడా కష్టంగా మారిపోయింది. రోగం ముదిరితే తప్ప ఓమిక్రాన్ అని గుర్తించలేని పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఓమిక్రాన్ వైరస్ ముప్పు చాపకింద నీరులా వ్యాప్తిస్తుండటంతో కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాలు లాక్ డౌన్ ల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, యూపీతో పాటు పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూలు ప్రకటించాయి. అంతే కాదు పగటి పూట కూడా జనం ఎక్కువగా గుమికూడే కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ఆయా చోట్ల అనధికార లాక్ డౌన్ అమలులోకి వచ్చినట్లే అనిపిస్తోంది.