అక్కరకురాని అభివృద్ధి, ఇబ్బందుల్లో ప్రజానీకం!
పేదలకోసం పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి
ఏ దేశానికి అయినా అభివృద్ధి అనేది అవసరమే. కానీ అది సామాన్య మానవ్ఞని పురోగతికి దోహదపడాలి.
మనం తలపెట్టే అభివృద్ధికార్యక్రమం వలన ఏవైనా నష్టాలు వాటిల్లుతున్నట్లయితే వాటిని అరికట్టడానికి ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
కానీ దేశంలో ఎన్నో సమస్యలతో ప్రజానీకం అష్టకష్టాలు పడుతున్నారు. వారి గురించి ఆలోచించే నాయకులు కరవుతున్నారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అట్టడుగు, పేద ప్రజానీకం గురించి ఆలోచించి పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి, పారదర్శకంగా అమలుపరిచి వారి అభివృద్ధికి పాటుపడాలి.
కాలం మారుతున్న కొలది మానవ జీవన మనుగడ లో పరివర్తన అనేది పురో గాభివృద్ధిని సూచించాలి. కానీ నేటి ఈ సమాజంలో దారిద్య్రరేఖ కు దిగువనున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది.
దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి రాకెట్ వేగంతో పరుగులు పెట్టినా పేదవాడి కడుపును నింపలేకపోతున్నది. ప్రస్తుత సమాజంలో ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవ్ఞ తున్నాడే తప్పా పేదవాడు మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలే కపోతున్నాడు.
దేశంలో అత్యధిక శాతం ప్రజలు గతంలో వ్యవ సాయరంగంపై ఆధారపడి, ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా ఆహారపంటలనే పండిస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.
కానీ సాధిస్తున్న ప్రగతిలో భాగంగా నేడు వివిధ కార్పొరేట్ సంస్థలు వ్యవసాయంపైన వ్యాపారం చేయడం మొదలుపెట్టి అధిక లాభాలను పొందుతున్నారు. చల్లని,బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి అన్ని రకాల ఆహారపదార్థాలను పండింపచేసి అధిక ధరలకు అమ్ముతున్నారు.
నేడున్న పరిస్థితు లలో గ్రామాలలోనున్న సన్నకారు రైతులు కూడా వారికున్న ఒకటి రెండు ఎకరాల్లో ఆహార పంటలను కాకుండా వాణిజ్య పంటలు పండించడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారన డంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
అయినా వారికి లాభాలు రాకపోగా, నష్టాల ఊబిలో చిక్కుకోని ఆత్మహత్యలకు పాల్పడిన రైతులను వివిధ పత్రికలలో చూస్తూనే ఉంటాం. దీనికిగల కార ణాలెన్నో ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులలో ఒక రైతు పంట పండించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకొని ఉంటుంది.
గతంలో వలే పాడిపశువులు కనుమరుగైపోయి వివిధ యంత్రాల సహా యంతో నేలను చదునుచేసి,రసాయనాలతో కూడిన విత్తనాలను అధిక ధరతో విక్రయించి, అధిక దిగుబడి నిమిత్తం క్రిమి రసా యనిక ఎరువులు, మందులు వాడి పంటను పండిస్తారు.
చివరికి అతివృష్టి, అనావృష్టి జరగకపోతే ఎంతోకొంత పంట దిగు బడి వచ్చిన, దానికి గిట్టుబాటు ధర దొరకకపోవడం, మొదటి నుండి ఆర్థిక వెసులుబాటుకై మధ్యవర్తులపై ఆధారపడి, అధిక వడ్డీలకు అప్పులు చేసి చివరికి అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ప్రాణాలను తీసుకునే పరిస్థితులు దాపురించాయి.
ఇదిలా ఉంటే మార్కెట్లలో లభించే ఆకుకూరలు, కూరగాయలు, పలురకాల ఆహార పదార్థాలను వివిధ రసాయనిక మందులు వాడి, పం డించడం మూలంగా అందులోని నాణ్యత కోల్పోయి, వివిధ అనారోగ్య పరిస్థితులకు ఊతమిస్తుందనడంలో ఎలాంటి అవా స్తవం లేదు. చివరికి వివిధ రకాల పండ్లను సైతం కాయలుగా ఉన్నప్పుడే కోసి, రంగు రావడానికి, పండ్లుగా మారడానికి కార్బైడ్ లాంటి పదార్థాలను వాడి మార్కెట్లోకి తెస్తే విక్రయ దారులు వాటిని తిని వివిధ రోగాల బారినపడుతుంటారు.
గతంలో ఎలాంటి అధునాతనమైన వైద్యసౌకర్యాలు లేనప్పుడు సగటు మానవుడు వందకుపైగా ఏళ్లు జీవించేవారు. నేటి అభివృద్ధిలో ఎన్నో వైద్యాలయాలు వెలసినా జనాలతో కిక్కిరిసి అర్థాయుష్షుకే పరిమితమవ్ఞతున్నారంటే కారణం అది మన ప్రగతియేనని చెప్పకతప్పని పరిస్థితి.
పెద్దపెద్ద పట్టణాలలో, నగరాలలో పెద్ద వ్యాపారస్తులు ఆహారపదార్థాలను పండించి వ్యాపారాలు చేస్తూ లాభాలను గడిస్తుంటే వాటిని పండించే రైతులు నగరాలకు, పట్టణాలకు వలసలు వెళ్లి, పొట్టకూటికై వ్యవసాయేతర పనులు చేసుకుంటూ అధిక డబ్బు వెచ్చించి ఆహారపదార్థాలను కొనడం కొసమెరుపు ఇక్కడా! కేవలం ఆహార పదార్థాలే కాకుండా పాలు, నీళ్లు, నూనెలు అన్ని కల్తీఅయి జనాల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు.
పాతికవయస్సు రాగానే విభిన్న వ్యాధులతో బాధపడే పరిస్థితులు దాపురించాయి. ధ్వనికాలుష్యం, వాయు కాలుష్యం, జలకాలుష్యాలతోపాటు ప్లాస్టిక్ వినియోగం, పాలి థిన్ కవర్స్ వాడకం ఎక్కువైంది.
దేశంలో అభివృద్ధి కొరకై అటవీ వినాశనానికి దారితీయడం, తయారీరంగంలో ముందుకు సాగడానికి ఎన్నో కంపెనీలకు అవకాశాలిచ్చి గ్లోబల్ వార్మింగ్కు కారకులవ్ఞతున్నాం. ఇప్పటికే ఏడాదికేడాది ఉష్ణోగ్రతలు పెరిగి, భూగర్భ జలాలు అడుగంటిపోతూ, వర్షాలకై ఎదురుచూపులు చూసేతరుణం ఆసన్నమైంది.
వీటన్నింటి దృష్ట్యా రాబోయే తరాల జీవనగమనం ప్రశ్నార్థకమవ్ఞతుందేమోనన్న భయం వెంటాడక మానదు. ఒక్క రంగంలోనే కాదు అభివృద్ధి అనే సాకుతో విభిన్నరంగాలలో పలుమార్పులు చోటు చేసుకొని మానవ మనుగడకు అంతరాయం కలిగిస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
మానవ సంబంధాలు క్రమంగా కనుమరుగవ్ఞతున్నాయి. మనుషులు యాంత్రిక జీవనానికి అలవాటుపడిన ప్రేమ,వాత్సల్యం, అనురాగం అనే మాటలకు అర్థాలు తెలియకుండా తయారవుతున్నారు.
మానవ సంబంధాలకంటే ఆర్థికపరమైన సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం నేటి అభివృద్ధికి దిక్సూచిగా మారింది.
పాలక వర్గానికొస్తే మసి పూసి మారేడుకాయ చేసేటట్లుగా గద్దెనెక్కేదాక ఎన్నో కట్టుకథలు చెప్పి, తీరా గద్దెనెక్కగానే కథలు మార్చే తంతు కొనసాగుతుంది.
నిమ్నవర్గాలకు, దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజలను కాపా డవలసిన ప్రభుత్వాలు లెక్కలకే పరిమితమై ఆచరణలో అంతగా ప్రాధాన్యతనివ్వడం లేదన్నది నూటికి నూరుపాళ్లు నిజమనక తప్పదు.
దానికి కారణాలు పరిశీలిస్తే అనేకం. ఈ ప్రపంచీక రణలో పరుగెడుతున్న శాస్త్ర,సాంకేతిక అభివృద్ధి,మన ఆహారపు అలవాట్లలోని మార్పులే కారణం.
దీని నియంత్రణకు పాల్పడక పోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదు. పాతిక సంవత్సరాల వెనుకకు వెళ్లి చూస్తే శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి జరగలేదు. అయినా మనుషులు సుఖవంతమైన జీవితాలను గడిపేవారు.
వ్యవసాయదారులు కేవలం వర్షాలపై ఆధారపడి, ఆహార పంటలు, చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు, పెసర్లు, ఉలవలు, కందులు, మినుములు,తైదలు లాంటి పంటలు పండించడం, వాటికి ఎలాంటి క్రిమిసంహారక, రసాయనిక మందుల వాడకం ఉండేదికాదు.
విత్తనాలను సైతం వారే తయారు చేసుకోవడం, పంటదిగుబడి ఎక్కువ రావడానికి సహజ ఎరువ్ఞలను వాడటం జరిగేది. సమాజంలో వాతావరణ కాలుష్యంతోపాటు, నేల కాలుష్యాన్ని తగ్గించడానికి రూపకల్పన జరిగి, ఖచ్చితంగా నెరవేర్చుటకు ప్రత్యేక యంత్రాంగాన్ని తయారు చేయాలి.
ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తొందరగాఅరికట్టాలి. అడవులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ రైతులకు చిరుధాన్యాలను పండించడా నికి ప్రోత్సహిస్తూ, గిట్టుబాటు ధరలను కల్పించాలి.
మార్కెట్లలో లభించే ఫాస్ట్ఫుడ్ జంక్ఫుడ్, తీసుకోవడం వలన జరిగే అనర్థాలను ప్రజలకు తెలిసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న నాటి నుండే ఆహారపు అలవాట్లలో విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
వీలైనంత తక్కువ క్రిమి సంహారక మందులు, రసాయనాలను వాడేటట్లు,రోగనిరోధక శక్తిని కలిగి విత్తనాలను తయారు చేయడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు పూనుకొని దానికనుగుణంగా పరిశోధనలు జరపా ల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
వీటన్నింటిని క్రమపద్ధతిలో నెరవేర్చుకుంటూ అవలంబిస్తే కొంతమేరలో మన ఆరోగ్యాలను కాపాడుకున్న వాళ్లమవుతాం.
లేనియెడల భవిష్యత్తులో నేటి పరిస్థితులు కొనసాగితే తీవ్ర గడ్డుపరిస్థితులు ఎదుర్కొని తమ ఆయుష్షును తామే నాశనం చేసుకునే విధంగా దోహదపడుతుందనడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.
సమాజం లోని అన్నివర్గాల ప్రజలు పూనుకొని సమిష్టిగా అవలంభించిన ప్పుడే దానికితోడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లభించి నప్పుడే సాధ్యపడుతుంది. కానీ లేనియెడల ఫలితం శూన్యమే.
ఆహారపు అలవాట్లను మార్చుకుందాం.అనారోగ్యాలను పార ద్రోలుదాం. పోషకాల ఆహారమే ఆరోగ్యానికి అండ. రైతులను ప్రోత్సహిస్తూ గిట్టుబాటు ధర కల్పిద్దాం. ఏ దేశానికి అయినా అభివృద్ధి అనేది అవసరమే. కానీ అది సామాన్య మానవుని పురోగతికి దోహదపడాలి.
మనం తలపెట్టే అభివృద్ధి కార్యక్రమం వలన ఏవైనా నష్టాలు వాటిల్లుతున్నట్లయితే వాటిని అరికట్టడానికి ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టా ల్సిన అవసరంఎంతైనా ఉంటుంది.
కానీ దేశంలో ఎన్నో సమస్యలతో ప్రజానీకం అష్టకష్టాలు పడుతున్నారు. వారి గురించి ఆలోచించే నాయకులు కరువవుతున్నారు.
ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అట్టడుగు, పేద ప్రజానీకం గురించి ఆలోచించి పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి, పారదర్శ కంగా అమలుపరిచి వారి అభివృద్ధికి పాటుపడాలి.
- డా.పోలం సైదులు
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/