మునుగోడు లో జోరుగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ

మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ వ్యాప్తంగా కాకరేపుతుంది. కాంగ్రెస్ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో నెల , రెండు నెలల్లో ఉప ఎన్నిక జరగబోతుండడంతో నియోజవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. మరోపక్క ఉప ఎన్నికల్లో ఓటుకు భారీ ఎత్తున నగదు పంచబోతారని వార్తలు ప్రచారం అవుతుండడంతో 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేయించుకుంటున్నారు. పక్క నియోజకవర్గ ఓటర్లు సైతం మునుగోడుకు ఓటు మార్చుకుంటున్నారు.

ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా 13 వేల 962 మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వేరే నియోజకర్గం నుంచి 488 మంది మునుగోడుకు తమ ఓటును బదిలీ చేయించుకున్నారు. ఉప ఎన్నిక ఉండడంతో వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా తమ సొంత ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గానికి వస్తున్నారు. ఆధార్ కార్డులో అడ్రస్, ఓట్ల మార్పిడి చేయించుకుంటున్నారు. దీంతో మీ సేవ కేంద్రాలు, నియోజకవర్గంలోని తహసీల్దార్ ఆఫీసుల్లో పబ్లిక్ తో కిక్కిరిసిపోతున్నాయి.