హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు , వంకలు పొంగిపోర్లుతున్నాయి. పలు రహదారులు కొట్టుకొనిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాతావరణ శాఖ రెడ్ అలర్డ్ విధించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పాటు డీఆర్‌ఎఫ్ సిబ్బంది భారీ వర్షాల్లో చేపట్టాల్సిన చర్యల నిమిత్తం సంసిద్ధమయ్యారు. ఇక తెలంగాణ లోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వాన దంచికొట్టింది. వర్షాలకు నల్లగొండలో ఓ ఇళ్లు కూలడంతో తల్లీకూతుళ్లు మృతిచెందారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. ఇల్లందు సింగరేణి ఏరియాలో ఏకధాటిగా వర్షం కురియడంతో ఇల్లందు, కోయగూడెం ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి భారీగా నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండాల్లో వాన దంచికొడుతున్నది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌, నాంపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంటల్లో చిరుజల్లులు పడుతుండగా.. ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, పెద్దఅంబర్‌పేట, తుర్కయంజాల్, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తున్నది.