పూర్తిస్థాయిలో లాక్ డౌన్ కు రెడీ: ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ : ఎయిర్ పొల్యూషన్‌పై పోరాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేయ‌డానికి రెడీగా ఉన్న‌ట్టు తెలిపింది. అయితే ఢిల్లీలో మాత్రమే లాక్ డౌన్ విధిస్తే అంత‌గా ఉప‌యోగం ఉండ‌ద‌ని కేజ్రీవాల్ సర్కార్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే ఢిల్లీ.. దాని పొరుగు ప్రాంతాల్లో కూడా ఆంక్షలు అవసరమని పేర్కొంది. భారత ప్రభుత్వం లేదా ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ద్వారా ఈ చర్యను నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిసర ప్రాంతాల్లోని తప్పనిసరి చేయాల‌ని.. అప్పుడే లాక్ డౌన్ విధించ‌డానికి తాము సిద్ధమ‌ని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

ఇప్పటికే ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ప్ర‌క‌టించిన కేజ్రీవాల్ ప్ర‌భుత్వం.. ఆన్ లైన్ క్లాసులు మాత్ర‌మే ఉంటాయ‌ని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు.. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వారం పాటు.. వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణాలు జరిగే ప్రాంతాలన్నీ మూడు రోజుల పాటు బంద్ చేయాలని ఢిల్లీ సర్కార్ పేర్కొంది. శనివారం ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, ప్రమాదకరమైన పొగమంచును పరిష్కరించడానికి అత్యవసర ప్రణాళికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు, పరిస్థితి “చాలా తీవ్రమైనది” ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధానిగా ఢిల్లీ తరచూ ర్యాంకుల్లో నిలుస్తోంది. పంట దుబ్బుల‌ను కాల్చడం, వాహ‌నాల ద్వారా వ‌చ్చే పొల్యూష‌న్‌.. సిటీ బయట బొగ్గు ఆధారిత ప్లాంట్లు, ఇతర పరిశ్రమలు, అలాగే బహిరంగ చెత్తను కాల్చడం , ధూళి కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది.

కాగా, ఢిల్లీలో ఎయిర్ పొల్యూష‌న్‌ రోజురోజుకు డేంజ‌ర్ లెవ‌ల్స్‌ను దాటేస్తోంది. దీంతో దేశ రాజధానిలో నెలకొన్న పరిస్థితులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్ప‌డుతోంద‌ని.. ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. గాలి నాణ్యతలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి సర్కార్ దగ్గరున్న అత్యవసర ప్రణాళిక ఏంటని కోర్టు అడిగింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్‌ తీసుకునేందుకు రెడీగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/