మళ్లీ రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ

6.5 శాతానికి చేరిన రెపో రేటు

rbi-hikes-repo-rate

న్యూఢిల్లీః ఆర్ బీఐ కీలకమైన రెపో రేటును పావు శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.50 శాతానికి చేరింది. ఆర్ బీఐ ఎంపీసీ సమీక్ష నేటి ఉదయం ముగియగా, ఇందుకు సంబంధించి వివరాలను ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు వెల్లడించారు. తాజా రెపో రేటు పెంపుతో.. గతేడాది మే నుంచి చూసుకుంటే మొత్తం మీద రెపో రేటు 2.5 శాతం మేర పెరిగింది. దీనివల్ల రుణ ఈఎంఐలు పెరగనున్నాయి. పర్సనల్ లోన్, ఆటో లోన్ వంటివి ఫిక్స్ డ్ రేటుపై ఇచ్చే రుణాలు కనుక వీటి ఈఎంఐ పెరగదు. గృహ రుణాలను ఫ్లోటింగ్ రేటుపై ఇస్తారు. కనుక గృహ రుణాల ఈఎంఐ పెరగనుంది. రివర్స్ రెపో ఎటువంటి మార్పుల్లేకుండా 3.35 శాతంగా ఉంది.

అవసరమైతే వడ్డీ రేట్ల తగ్గింపునకు వీలు కల్పించే అకామడేటివ్ స్టాన్స్ (సర్దుబాటు వైఖరి)ను ఇప్పటి వరకు ఆర్ బీఐ కొనసాగించగా.. ఇక దీన్ని ఉపసంహరించుకోవడంపై దృష్టి సారిస్తామని ప్రకటించింది. కరోనా మహమ్మారి నుంచి బయటపడి, ఆర్థిక కార్యకలాపాలు వేగమందుకుంటూ, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న క్రమంలో ఆర్ బీఐ వైఖరిలో మార్పు చోటు చేసుకుంది. ద్రవ్యోల్బణ అంచనాలను పరిమిత స్థాయిలో ఉంచేందుకు వీలుగా క్రమబద్ధమైన మానిటరీ పాలసీ చర్యలు అవసరమని పేర్కొంది.

2023-24 సంవత్సరానికి (వచ్చే ఆర్థిక సంవత్సరం) మొత్తం మీద ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉంటుందని ఆర్ బీఐ ఎంపీసీ అంచనా వేసింది. తదుపరి ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో 5 శాతం, రెండో క్వార్టర్ లో 5.4 శాతం, మూడో త్రైమాసికంలో 5.4 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.6 శాతంగా ద్రవ్యోల్బణం ఉండొచ్చని పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా జూన్ నాటికి ద్రవ్యోల్బణం 5 శాతానికి దిగొస్తుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణంపై సునిశితంగా దృష్టి సారించి, లక్ష్యిత పరిధిలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. జీడీపీ వృద్ధి రేటు 2023-24 సంవత్సరానికి 6.4 శాతంగా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇది 7 శాతంగా ఉంటుందని పేర్కొంది.