గుజరాత్ ఎన్నికలు..జడేజా భార్యకు బిజెపి టికెట్?

జామ్ నగర్ నార్త్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి

Ravindra Jadeja’s Wife Rivaba Likely To Get BJP Ticket For Gujarat Assembly Polls:

న్యూఢిల్లీః గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిపే అభ్యర్థుల పేర్లను బిజెపి ఖరారు చేయనుంది. ఈ సందర్భంగానే టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివబా జడేజాకు గుజరాత్ ఎన్నికల్లో బిజెపి తరఫున టికెట్ వచ్చే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారంగా ఉంది. రివబా జడేజా 2019లో బిజెపిలో చేరడం గమనార్హం. గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి బిజెపి మొదటి విడత అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేయనుంది.

బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్, బిజెపి గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ మంగళవారం ఢిల్లీలో ఎన్నికల విషయమై చర్చలు నిర్వహించారు. బుధవారం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా భేటీ కానుంది. రవీంద్ర జడేజా భార్య రివబా జామ్ నగర్ (నార్త్ ) స్థానం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ స్థానానికి ధర్మేంద్ర సింగ్ జడేజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోసారి గుజరాత్ లో అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్న బిజెపి , ఈ విడత కొంత మంది సీనియర్లను తప్పించి యువతకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. కనుక రివబా జడేజా లక్ష్యం నెరవేరుతుందా? అన్నది కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/