చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలి

ప్రజలే స్పందించి చైనా ఉత్పత్తులు కొనకుండా ఉండాలి

ram vilas-paswan

న్యూఢిల్లీ: భారత్‌, చైనా ఘర్షణ నేపథ్యంలో చైనా వస్తువులను భారతీయులు కొనుగోలు చేయరాదని ప్రచారం జరుగుతుంది. ఈక్రమంలో కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పందిస్తు..ఈ విషయంలో ప్రజలే చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాల్సి వుందని, ప్రజల్లో స్పందన వస్తేనే చైనాకు బుద్ధి తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరఫున కూడా చైనా దిగుమతులను క్రమంగా తగ్గిస్తామని వెల్లడించిన ఆయన, ఇండియాకు తొలి శత్రువు చైనాయేనని నాడు అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ అన్న మాటల్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. మనకు ప్రమాదకరంగా మారిన పొరుగు దేశం నుంచి వస్తు ఉత్పత్తులను కొనాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

‘చైనా ఇటువంటి దాడికి దిగి, మన సైనికులను అమరులను చేసిందంటే, ద్వైపాక్షిక చర్చల కన్నా, వారి వస్తువులను కొనకుండా ఉంటేనే ఆ దేశానికి మరింత నష్టం కలుగుతుంది. భారతీయులు తమ ఇళ్లలో పూజించే వినాయకుడి విగ్రహాలను, చైనా నుంచి ఎందుకు తెచ్చుకోవాలి?’ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే భారత వస్తువుల క్వాలిటీని పెంచేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలను కఠినతరం చేసిందని గుర్తు చేసిన ఆయన, అతి త్వరలో కొత్త నిబంధనలు, నియంత్రణా విధానాన్ని దిగుమతులపై ప్రకటించనున్నామని రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/