ఏపీ సీఎం జగన్‌పై కేంద్ర మంత్రి అథవాలే ప్రశంసలు

ఏపీ సీఎం , వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్‌ అథవాలే ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని నిర్ణయించిన జగన్ గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణలోని హన్మకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన ‘దళిత బహుజన రాజ్యాధికార చైతన్య బహిరంగ సభ’లో ఆయన మాట్లాడారు.

కొందరు దళిత, బహుజన వ్యతిరేకులు అంబేడ్కర్‌ పేరు వద్దని ఆందోళనలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం పురోగతి సాధిస్తోందని రాందాస్ అథవాలే అన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కుతోందని చెప్పుకొచ్చారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్)పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారని ఆరోపించారు.