కొలంబియా యూనివర్సిటీని సందర్శించిన జస్టిస్ ఎన్.వి.రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం న్యూయర్క్ కు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్రా ఎల్ల, భారత కాన్సులెట్ జనరల్ రణ్ధీర్ జైశ్వాల్, తానా పూర్వ అధ్యక్షులు జయ్ తాళ్లూరి, తానా ప్రముఖులు వలివేటి బ్రహ్మాజీ, వాసిరెడ్డి వంశీ, అరవింద్ తదితరులు ఘన స్వాగతం పలికారు. జులై 03 వరకు రమణ అమెరికాలో రమణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా న్యూజెర్సీ, వర్జీనియా, కాలిఫోర్నియా తదితర రాష్ట్రాలను ప్రధాన న్యాయమూర్తి సందర్శిస్తారు. స్థానికంగా ఉన్న భారతీయ సంఘాలు, తెలుగు సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు.
ఈ క్రమంలోనే శుక్రవారం న్యూయార్క్ నగరంలోని కొలంబియా యూనివర్సిటీని సీజేఐ సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. అనంతరం ‘స్కాలర్స్ లయన్’ వద్ద కాసేపు సరదాగా గడిపారు. రేపు వర్జీనియాలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ వాషింగ్టన్ డీసీ ఆధ్వర్యంలో జరగనున్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో జస్టిస్ ఎన్.వి.రమణ పాల్గొంటారు. సీజేఐ గౌరవార్థం మిల్పిటాస్లో జులై 1న అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.