టీడీపీ తెలంగాణ అధ్యక్షుడి పదవికి ఎల్.రమణ రాజీనామా
చంద్రబాబుకి లేఖ
హైదరాబాద్ : టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ఆ పదవికి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆయన తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి రాజీనామా లేఖ పంపారు. నిన్న ప్రగతిభవన్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లిన ఎల్.రమణ పార్టీ మారడంపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారాలని తుది నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.రమణ నేటితో టీడీపీలో తన ప్రస్థానాన్ని ముగించారు.
టీఆర్ఎస్లో చేరాలని తాను నిర్ణయించుకున్నట్లు రమణ ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పుకొచ్చారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, టీఆర్ఎస్లో తగిన గుర్తింపు ఇస్తామని, రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని నిన్న ఎల్.రమణకు కేసీఆర్ హామీ ఇచ్చారు.
దీంతో ఆ పార్టీలో చేరేందుకు రమణ అంగీకరించారు. త్వరలోనే టీఆర్ఎస్ అధికార కార్యాలయం తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి కీలక నేత ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఎల్.రమణ వంటి నాయకుల అసవరం ఉందని భావించిన టీఆర్ఎస్ ఆయనను పార్టీలో చేర్చుకుంటోంది. టీఆర్ఎస్లో చేరి బీసీల కోసం కృషి చేయాలని ఆయనకు కేసీఆర్ సూచనలు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/