ప్రధాని మోడికి అయోధ్య ట్రస్ట్‌ లేఖ

అయోధ్యలో పర్యటించాలని కోరుతూ..రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లేఖ

PM Narendra Modi
PM Narendra Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడికి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లేఖ రాసింది. త్వరలో అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అయోధ్యలో పర్యటించాలని కోరుతూ మోడికి ఈ లేఖ రాసినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ స్వయంగా వెల్లడించారు. అయోధ్యలో పర్యటించి, రామ మందిర నిర్మాణ పనులను ప్రారంభించాల్సిందిగా ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అయోధ్య పర్యటన ప్రధానికి వీలుకాని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా శంకుస్థాపన చేయాలని ఆ లేఖలో కోరినట్టు దాస్ తెలిపారు.

రామ మందిర నిర్మాణానికి ఇప్పటికే భూమి పూజ జరిగిన నేపథ్యంలో పనులను ప్రారంభించాలని భావిస్తున్న ట్రస్ట్.. శ్రావణమాసం చివరి రోజైన ఆగస్టు 5న నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తోంది. మరోవైపు, ఆలయాన్ని నిర్మించే ప్రదేశంలో భూమిని చదును చేసే పనులు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. అలాగే, రాళ్లను చెక్కే పని కూడా ముమ్మరంగా సాగుతోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/