డిక్లరేషన్ తీసుకున్న భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి

పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజక వర్గం నుంచి గెలుపొందిన టిడిపి అభ్యర్ధికి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి డిక్లరేషన్ ఫాం అందజేశారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. టపాసులు పేల్చి… స్వీట్స్ పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కాగా పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి విజయం సాధించినా.. ఎన్నికల అధికారులు డిక్లరేషన్‌ ఇవ్వలేదు. దీంతో టీడీపీ నేతలు ఆందోళకు దిగారు. దాదాపు 3గంటల పాటు డిక్లరేషన్‌ ఫారం కోసం వేచిచూశారు. రీ కౌంటింగ్‌ కోరుతూ వైస్సార్సీపీ వర్గీయులు ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో ఎన్నికల అధికారులు ఏదో చేస్తున్నారని టీడీపీ వర్గీయుల్లో ఆందోళన మొదలైంది.

దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం వద్ద రాత్రి 11.20 సమయంలో భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డితో కలిసి బైఠాయించారు. టీడీపీ అభ్యర్థికి వెంటనే డిక్లరేషన్‌ ఫారం ఇవ్వాలని కాలవ, పరిటాల సునీత డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయేందుకు కారులో వచ్చారు. టీడీపీ శ్రేణులు అడ్డుగా వెళ్లడంతో ఆమె తిరిగి కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. ఎన్నికల్లో గెలిచారని అధికారులు స్వయంగా ప్రకటించిన భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకువెళ్లి పోలీసులు వ్యానులో పడేశారు. అనంతరం వీరిని అనంతపురం త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.