కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ పాడెను మోసిన టిఆర్ఎస్ మంత్రులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఆర్పీఎఫ్ జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన రాకేశ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. నేడు రాకేష్ స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. రాకేష్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య దబీర్పేట వైకుంఠధామంలో పూర్తీ అయ్యాయి. రాకేష్ పాడెను మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మోసి శ్రద్ధాంజలి ఘటించారు. రాకేష్ అంతిమయాత్రలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతకు ముందు వరంగల్ ఎంజీఎం నుంచి రాకేష్ అంతిమయాత్ర స్వగ్రామం వరకు సాగింది. ఈ అంతిమయాత్రలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎస్పీ, వామపక్ష కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం మారుమూల డబీర్పేట గ్రామానికి చెందిన దామెర కుమార స్వామి, పూలమ్మ దంపతుల కొడుకు రాకేశ్ (21) హన్మకొండలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో పనిచేస్తున్న తన అక్క సంగీత నుంచి ప్రేరణ పొంది ఆర్మీలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
దామెర రాకేశ్..రెండుసార్లు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలకు హాజరయ్యాడు. చిన్న కారణం వల్ల ఉద్యోగం కోల్పోయాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ ప్రయత్నించాడు. ఇటీవలే ఫిజికల్ టెస్ట్లలో ఉత్తీర్ణత సాధించాడు. ఎంపిక ప్రక్రియ కోసం వేచి చూస్తున్నాడు. అయితే అగ్నిపథ్ స్కీం ద్వారానే రిక్రూట్మెంట్ జరుగుతుందని తెలియగానే తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. హన్మకొండకు చెందిన మరో 14 మందితో కలిసి నిరసన తెలిపేందుకు హైదరాబాద్కు చేరుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పాయాడు.