ముగిసిన రాజ్యసభ తొలి విడుత బడ్జెట్ సమావేశాలు

రాజ్య‌స‌భ మార్చి 13వ తేదీకి వాయిదా

rajya-sabha-adjourned-till-march-13

న్యూఢిల్లీః బ‌డ్జెట్ స‌మావేశాల‌కు చెందిన తొలి ద‌ఫా రాజ్య‌స‌భ స‌మావేశాలు ముగిశాయి. మార్చి 13వ తేదీకి రాజ్య‌స‌భ వాయిదా ప‌డింది. అదానీ స్టాక్స్ మోసాల‌పై చ‌ర్చ చేప‌ట్టాని, ఆ అంశంపై ద‌ర్యాప్తున‌కు జేపీసీ వేయాల‌ని విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. విప‌క్షాలు ప్ర‌శ్నోత్త‌రాల‌ను అడ్డుకోవ‌డంతో తొలుత స‌భ‌ను 11.50 నిమిషాల వ‌ర‌కు వాయిదా వేశారు. ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ప్ర‌సంగం నుంచి కొన్ని భాగాల‌ను తొల‌గించ‌డాన్ని కూడా విప‌క్షాలు త‌ప్పుప‌ట్టాయి. ఈ అంశంపైన కూడా స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టాయి. కొంద‌రు ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లారు. రాఘ‌వ చ‌డ్డా, సంజ‌య్‌సింగ్‌, ఇమ్రాన్ ప్ర‌తాప్‌గిరి, శ‌క్తి సింగ్ గోహిల్‌, సందీప్ పాఠ‌క్‌, కుమార్ కేట్క‌ర్‌లు వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు.

కావాల‌నే స‌భా కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకుంటున్నార‌ని, స‌భ‌ను న‌డిపించే తీరు ఇది కాదు అని, ఇప్ప‌టికే చాలా స‌మ‌యాన్ని వృధా చేశామ‌ని, హౌజ్‌లో ఇలాంటి గంద‌ర‌గోళం స‌రికాదు అని, ప్ర‌జ‌ల ఆశ‌యాల‌కు త‌గ్గ‌ట్లు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని రాజ్య‌స‌భ చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ తెలిపారు. వ‌త్తిడిలో విధులు నిర్వ‌ర్తిస్తున్నట్లు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే చేసిన ఆరోప‌ణ‌ల‌ను చైర్మెన్ ఖండించారు.

కాగా, బ‌డ్జెట్ సెష‌న్‌కు చెందిన రెండో ద‌ఫా స‌మావేశాలు మార్చి 13వ తేదీన ప్రారంభంకానున్నాయి.