కృష్ణం రాజు ఇంటికి చేరుకున్న రాజ్ నాథ్ సింగ్

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలంగాణ బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు. రాజ్ నాథ్ సింగ్ కు శాలువా కప్పి వివేక్ సన్మానించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు ఇంటికి రాజ్ నాథ్ సింగ్ చేరుకున్నారు. రాజ్ నాథ్ వెంట బీజేపీ నేతలు లక్ష్మణ్, చింతల రామచంద్రా రెడ్డి ఉన్నారు. కాసేపట్లో కృష్ణంరాజు సంతాప సభలో రాజ్ నాధ్ సింగ్ పాల్గొని , ప్రసంగిస్తారు.

కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరి కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు మరణం పట్ల చింతిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయుకులు కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలిపారు. కొందరు అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. 60 ఏళ్లకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలిగిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం (సెప్టెంబర్‌ 11న) అనారోగ్యంతో కన్నుమూశారు. చికిత్స పొందుతూ ఏఐజి ఆసుపత్రిలో మృతిచెందారు. కృష్ణంరాజు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానుల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి.