కృష్ణంరాజు మరణం చిత్రపరిశ్రమకు తీరనిలోటు – రాజ్ నాథ్ సింగ్

కృష్ణంరాజు మరణం చిత్రపరిశ్రమకు తీరనిలోటు అన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. శుక్రవారం కృష్ణం రాజు సంతాప సభలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ.. 1998లో నేను కృష్ణంరాజును తొలిసారి కలిశాను. అప్పుడాయన పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ఢిల్లీకి వచ్చారు. వాజ్ పేయి మంత్రి వర్గంలో ఉన్నప్పుడు ఆయనకు చాలా దగ్గరయ్యాను అని , కృష్ణంరాజు నాకు ఆత్మీయ మిత్రుడు. ఢిల్లీలో ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు అని రాజ్ నాథ్ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

కొన్ని నెలల క్రితం ఢిల్లీలో కృష్ణంరాజును కలిసేందుకు వెళ్లినప్పుడు అనారోగ్యంతో ఉన్నట్లు అనిపించలేదు. చాలా బాగా నాతో మాట్లాడారు. కృష్ణంరాజు ఇక లేరనే ఆకస్మిక వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. దాన్ని నేను చాలాసేపటి వరకు నమ్మలేకపోయాను’’ అన్నారు. కృష్ణంరాజు పెద్ద స్టార్ అయినా.. నన్ను అన్నగారు అని పిలిచేవారని తెలిపారు. వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండేవారన్నారు. కృష్ణంరాజు 55 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశారని చెప్పారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ని, కృష్ణంరాజు ని ప్రత్యేకంగా అభినందించానని పేర్కొన్నారు.

అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణంరాజు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో తాను బిజెపి యూత్ నాయకుడిగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు ప్రతిరోజు కలిసే వాళ్ళమని గుర్తుచేసుకున్నారు. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటానని కృష్ణంరాజు కోరినట్లు తెలిపారు. అందరూ అభిమానించే వ్యక్తి కృష్ణంరాజు అని.. మనసులో కల్మషం లేని వ్యక్తి అని కొనియాడారు. రాబోయే ఎన్నికలలో దేశంలోని పలు రాష్ట్రాలలో బిజెపి ప్రచారంలో పాల్గొంటానని తనతో చెప్పారని తెలిపారు. అంతకు ముందు రాజ్ నాథ్ జూబ్లీహిల్స్ లోని కృష్ణం రాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇక క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ సంతాప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.