కేసీఆర్ కు రాజగోపాల్ సవాల్ ..దమ్ముంటే మునుగోడులో పోటీ చెయ్

మాజీ ఎమ్మెల్యే , బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ..ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే మునుగోడులో పోటీ చేయాలనీ సవాల్ చేసారు. అంతే కాదు మునుగోడు ఉప ఎన్నికల తర్వాత నెల రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశంలో రాజగోపాల్ పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను మారుస్తుందని అన్నారు. టిఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని..ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ గెలిచేది లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ కు దమ్ముంటే మునుగోడులో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయాలని సవాల్ విసిరారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ ప్రజలు, కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. మునుగోడులో కేసీఆర్ పోటీ చేసినా టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువని.. ఆకలినైనా తట్టుకుంటారు గానీ.. ఓట్లు అమ్ముకోరని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు ఇచ్చే తీర్పు చారిత్రాత్మకం కానుందని చెప్పారు. తాను కాంట్రాక్టులు, డబ్బులకు అమ్ముడుపోయి బీజేపీలో చేరానని టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తినే అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేవాడినే కాదని ఆవేదన వ్యక్తం చేశారు.