హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో జోరు వర్షం
హైదరాబాద్ ను వర్షం పలకరించింది. గత వారం , పది రోజులుగా జాడలేకుండా పోయిన వర్షం..ఈరోజు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం జల్లులు కురిసాయి. దిల్సుఖ్నగర్, అంబర్ పేట, మలక్పేట, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్, బోయిన్పల్లి, మారేడ్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, బేగంపేట్, చిలకలగూడ, రాంనగర్, ఓయూ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లక్డీకాపూల్, పంజాగుట్ట, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, అల్వీన్ కాలనీ, హైదర్ నగర్, నిజాంపేట్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కనిపించినప్పటికీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురియగా, మరికొన్ని చోట్ల భారీ వర్షం నమోదైంది. నిమిషాల వ్యవధిలోనే రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. రోడ్లపైకి నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రాజేంద్రనగర్లో 1.5 సెంటీమీటర్లు, బాలానగర్లో 6.1 సెం.మీ., రంగారెడ్డినగర్లో 6 సెం.మీ., ఫతేనగర్ లో 5సెం.మీ., కూకట్పల్లిలో 4 సెం.మీ., కుత్బుల్లాపూర్లో 3.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరో మూడు హైదరాబాద్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించటంతో GHMC అధికారులు అలర్ట్ అయ్యారు.