ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక తీరాలను ఆనుకుని అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని, రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ నెల 12వ తేదీ ఉదయం వరకు ఇది వాయవ్య దిశగా తమిళనాడు-పుదుచ్చేరి వైపు పయనిస్తుందని, ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని హెచ్చరించింది.