ప్రయాణికుల సౌకర్యార్థం వారాంతపు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: విశాఖపట్టణం- సికింద్రాబాద్ విశాఖ- మహబూబ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నగరాల మధ్య రేపటి నుంచి జూన్ 29 వరకు వారాంతపు రైళ్లను నడపనున్నట్టు తెలిపింది. విశాఖపట్టణం-సికింద్రాబాద్ రైలు జూన్ 1న రాత్రి 7 గంటలకు విశాఖలో రైలు బయలుదేరి (08579/08580) తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి గురువారం సికింద్రాబాద్‌లో రాత్రి 7.40 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 6.40కి విశాఖపట్టణం చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడలో ఆగుతుందని అధికారులు తెలిపారు. ఈ రైలు జూన్ 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

అలాగే, విశాఖపట్టణం-మహబూబ్‌నగర్ రైలు (08585/08586) వచ్చే నెల 7 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతి మంగళవారం విశాఖలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, కాచిగూడ, జడ్చర్ల మీదుగా ప్రయాణించి తర్వాతి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ప్రతి బుధవారం సాయంత్రం 6.20 గంటలకు మహబూబ్‌నగర్‌లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. కాగా, సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని తొరంగల్లు సెక్షన్‌లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతుండడంతో విజయవాడ-హుబ్బళ్లి (17329/17330) రైలును జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/