రేపు మక్తల్ సబ్ స్టేషన్ నుంచి రాహుల్ జోడో యాత్ర ప్రారంభం

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రేపటి నుండి తెలంగాణ లో పున:ప్రారంభం కాబోతుంది. ఈ నెల 23న రాయచూర్ నుంచి రాహుల్‌ గాంధీ భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలో అడుగుపెట్టారు. దీపావళి, ఖర్గే ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో మూడు రోజుల పాటు రాహుల్ యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇక రేపు ఉదయం 6:30 గంటలకు జోడోయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఈ రోజు రాత్రి ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగి నేరుగా రాహుల్ గాంధీ మక్తల్‌కు వెళ్లనున్నారు.

వచ్చే నెల 7 వరకు తెలంగాణలో రాహుల్‌ జోడోయాత్ర కొనసాగనుంది. రాహుల్‌ పాదయాత్రలో ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు కార్నర్‌ సమావేశం జరగనుంది. ఇక రాహుల్ యాత్ర పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈనెల 30న షాద్నగర్కు కాంగ్రెస్ నేత రాహుల్ యాత్ర చేరుకోనుందని రేవంత్ రెడ్డి తెలిపారు. నవంబర్ ఒకటిన మధ్యాహ్నం 12 గంటలకు మునుగోడులో మహిళా గర్జన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మునుగోడు ప్రజలు మహిళా గర్జనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.