తెలంగాణ లో 12 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 07 నుండి తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ యాత్ర దేశవ్యాప్తంగా 150 రోజులపాటు 3,500 కిలోమీటర్లకుపైగా సాగనుంది. కేరళలో 19 రోజులు, కర్ణాటకలో 21 రోజుల తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలోకి అడుగుపెట్టనున్నారు.
12 రోజులపాటు ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల మీదుగా సుమారు 300-350 కిలోమీటర్ల మేర సాగనుంది. రాయచూర్ మీదుగా నారాయణపేట నియోజకవర్గంలోకి రానున్న రాహుల్ యాత్ర కొడంగల్, పరిగి, వికారాబాద్, జహీరాబాద్, నారాయణ్ఖేడ్, జుక్కల్ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. బిచ్కుంద, మద్నూరు మీదుగా మహారాష్ట్రలోని డిగ్లూర్కు వెళ్లేలా రూట్ మ్యాప్ తయారుచేశారు.
ఇదిలా ఉంటె..కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హెల్త్ చెకప్ కోసం మరోసారి విదేశాలకు వెళ్తున్నారు. ఆమెకు తోడుగా రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ కూడా వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలియజేసింది. సెప్టెంబర్ 4న ఢిల్లీలో జరిగే ‘మెహంగాయ్ పర్ హల్లా బోల్’ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని తెలిపారు.