పెట్రోల్‌, డీజిల్, వంట గ్యాస్‌ ధ‌ర‌ల‌పై కాంగ్రెస్ నిర‌స‌న‌

ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నిర‌స‌న‌.. పాల్గొన్న రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ : దేశంలో పెరిగిపోతోన్న పెట్రోల్‌, డీజిల్, వంట గ్యాస్‌ ధ‌ర‌ల‌పై కాంగ్రెస్ పార్టీ నేత‌లు మండిప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వ తీరుకు నిరసనగా ఈ రోజు ఉద‌యం ఢిల్లీలోని విజ‌య్ చౌక్ వ‌ద్ద కాంగ్రెస్ అగ్రనేత‌ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. ప‌ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను తొమ్మిది సార్లు పెంచారని రాహుల్ గాంధీ ఈ సంద‌ర్భంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. పెరుగుతోన్న ధరలను అదుపులోకి తీసుకురావాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన అనంత‌రం ఇంధన ధరలు పెరుగుతాయని తమ పార్టీ నేత‌లు ముందే చెప్పార‌ని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి గుర్తు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వ తీరుకు వ్య‌తిరేకంగా త‌మ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేప‌ట్టింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్ర‌భుత్వంపై చుర‌క‌లు అంటించారు. జీడీపీకి ఆయ‌న కొత్త అర్థం చెప్పారు. తాము అధికారంలోకి వస్తే జీడీపీ పెంచుతామ‌ని 2014 ఎన్నిక‌ల‌కు ముందు న‌రేంద్ర‌ మోదీ చెప్పార‌ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అంటే దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) అని ప్రజలు భావించారని, కానీ జీ అంటే గ్యాస్, డీ అంటే డీజిల్, పీ అంటే పెట్రోల్ ధరలు అని తెలుసుకోలేక మోసపోయామ‌ని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో సామాన్యులు సమిధలుగా మారుతున్నార‌న్నారు. కాంగ్రెస్ 2014లో అధికారం నుంచి దిగిపోయిన స‌మ‌యంలో 410 రూపాయ‌లు ఉన్న‌ వంట గ్యాస్ ధ‌ర ఇప్పుడు రూ.1,050 రూపాయ‌ల వ‌ర‌కు పెరింగింద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. సామాన్యులు భ‌రించ‌లేని విధంగా ధ‌ర‌లు పెంచే స్థితికి వ‌చ్చిన‌ప్ప‌టికీ దేశాన్ని తాము అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నామ‌ని బీజేపీ అబ‌ద్ధాలు చెప్పుకుంటోంద‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/