కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర

rahul-gandhi-bharat-jodo-yatra-in-kurnool-dist-ap

కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లాలో రెండోరోజు భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఉదయం వేళ చాగి గ్రామం నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర మొదలుపెట్టారు. ఈరోజు ఆదోని డివిజన్‌ అరెకల్‌ వరకు 25 కిలోమీటర్లపాటు నడవనున్నారు. తెల్లవారు జామునుంచి ఆదోని ప్రాంతంలో వర్షం కురుస్తోంది. అయితే అనుకున్న సమయం ప్రకారం ఆరున్నర గంటలకు రాహుల్‌ పాదయాత్ర మొదలుపెట్టారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మధ్యాహ్నం 1 గంటలకు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడనున్నారు.

భారత్ జోడో యాత్ర మార్గంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చాగి గ్రామానికి ఏడు కిలోమీటర్ల వరకు పోలీసులు ఆంక్షలు విధించారు. కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. యాత్రకు దూరంగా నిలిపివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నా.. రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. ఏపీలో మరో రెండురోజులపాటు రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఏపీలో మొత్తం 96 కిలో మీటర్లకు పైగా పాదయాత్ర సాగనుంది. ఏపీకి చెందిన కీలక నాయకులతోపాటు.. తెలంగాణ నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు.