అరెస్టు చేసి తీసుకెళ్లి గుండెలపై కూర్చొని కొట్టారు : ర‌ఘురామ

గ‌త ఏడాది ఇదే రోజు జ‌రిగిన ఘ‌ట‌న‌పై ర‌ఘురామ కృష్ణ‌రాజు

న్యూఢిల్లీ : వైస్సార్సీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణ‌రాజు వైస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ‌త ఏడాది ఇదే రోజు త‌న‌ను హైదరాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిన నేప‌థ్యంలో ఈ రోజు ర‌ఘురామ‌ ఢిల్లీలో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ… త‌న‌ను అరెస్టు చేసిన తీసుకెళ్లి తన గుండెలపై కూర్చొని బాగా కొట్టారని ఆరోపించారు. కొద్దిసేప‌య్యాక‌ త‌న‌ సెల్ ఫోన్‌ కోసం వెతికి మళ్లీ త‌న‌ను కొట్టారని తెలిపారు.

మొత్తం ఐదుసార్లు త‌న‌ను తీవ్రంగా కొట్టారని ఆయ‌న ఆరోపించారు. సీఎం జగన్‌, సునీల్‌ ఇద్దరూ ఏం తెలియ‌న‌ట్లు న‌టించార‌ని చెప్పారు. ఓ కానిస్టేబుల్ త‌న వ‌ద్ద‌కు వచ్చి ఏం జరిగింది? ఎవరు కొట్టారని అమాయకంగా అడిగాడ‌ని చెప్పారు. అనంత‌రం ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ వచ్చి త‌న‌ను మంచంపై పడుకోబెట్టాడ‌ని తెలిపారు. త‌న‌పై ఉన్మాది సంస్కృతిలో భాగంగానే దాడి జ‌రిగింద‌ని అన్నారు.

నేడు తాను 60వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నాన‌ని చెప్పారు. అయితే, గ‌త ఏడాది త‌న‌ 59వ పుట్టినరోజును ఘనంగా జరిపిన ఉన్మాదికి నా ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. ఆయ‌న‌కు 2024 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటుతో బుద్ధి చెబుతారని అన్నారు. హైదరాబాద్‌ పర్యటన తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా తనను కలవనున్నట్లు రఘురామ చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/